3037* వ రోజు...........           21-Feb-2024

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

                    స్వచ్ఛ సైన్యం ఊరి మెరుగుదల చర్య - @3037*

         21-2-24-బుధవారం వేకువ 20+3 గ్గురి ప్రయత్నం సామాన్యమైందే మీ కాదు. వారు 3 కిలోమీటర్ల దూరాన్ని దాటుకొని4.20 కే చేరుకొన్నది చిల్లలవాగు ప్రక్క శ్మశానానంతర చెత్త కేంద్రానికి; చివరి ఐదారుగురు చెత్త పనులు ముగించింది 6.28 కి ; ఇళ్లకు చేరుకొన్నది 6.50 కి!

         45 పని గంటలు వీళ్లు చలీ- మంచుల్లో, చేసిన ఉద్యోగాలేమంటే.

- 2 ట్రాక్టర్ల  చెత్త గుట్టను సంపద వనరుగా మార్చడం!

- అందుగ్గాను ముగ్గురు వంతున ఆరేడు బృందాలుగా విడివడడం!

- మొదటి త్రిమూర్తులు కదిలిస్తే కంపు గొడుతున్న గుట్టను దంతెతో కుళ్ళగించి, డిప్పల కెత్తి, ఎత్తు పీటల మీద ఆసీనులైన వారి నడుమ పోస్తుండడం!

 - చుట్టూ డిప్పలు పేర్చుకొని, సదరు వ్యర్థాల్ని  ఏరి ఏడెనిమిది రకాలుగా విభజించడం సుఖాసీనుల వంతు!

-  ఒక్కో రకాన్ని ఒక్కో భారీ గోనె సంచిలో నింపే పని ట్రస్టు సూపర్ వైజర్ ది!

- ఇంకో పెద్దాయన ఈ శ్రమ సన్నివేశాల్ని ఫోను కెమెరాలో బంధించడం!

- ఇలా విడగొట్టి, నింపిన భారీ సంచులు 50-60 సిద్ధంగా ఉన్నవి!

- రెండవ సేంద్రియ ఎరువు దిబ్బ పూర్తికావచ్చింది.

రేపు మళ్లీ వెల్లూరు శ్రీనివాసన్ గారు వస్తున్నారని తెలిసింది.

6.40 కి జరిగిన సమావేశంలో:

కస్తూరి విజయ్ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలిచ్చి, సర్పంచితో సహా 2 వారాలుగా కార్యకర్తల కష్టానికి బాధపడి, చెత్త సేకరణ దశలోనే వ్యాపారులు, గృహస్తులు విడగొట్టిన వ్యర్థాల్నందించవలసిన అవసరాన్ని మైకు ప్రచారంతో చాటించాలని సూచించగా,

         కార్యకర్తల, పంచాయతీ కార్మికుల ముక్కు చిక్కాల నిమిత్తం షణ్ముఖ శ్రీనివాసుని 500/- విరాళం గ్రామ సర్పంచి స్వీకరించగా,

         చర్చల తర్వాత రేపటి పని స్థలం కూడ ఈ డంపింగ్ యార్డు వద్దనే అనే నిర్ణయంతో  నేటి కార్యక్రమం ముగిసింది!

             వస్తు వినిమయ పాటవంతో

జనాభా విస్ఫోటనంతో- వస్తు వినిమయ పాటవంతో

సదవగాహన లేమితోనే సకల కాలుష్యాల భూతం

ఆపకుంటే జీవరాసులు అంతరించే పెను ప్రమాదం

అందుకే గద కార్యకర్తల అలవిమాలిన నిత్యయత్నం!

- నల్లూరి రామారావు

   21.02.2024