పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి రాగల ప్లాస్టిక్కులు మనకేల?
3158* వ శ్రమ సందడి 38 మందితో !
ఆదివారం (23-6.24 ) కాబట్టి కొందరు ప్రత్యేక కార్యకర్తల రాకతో శ్రమదాతల సంఖ్యా, సందడి పెరుగుతుందనుకొంటే ఆ సంఖ్య 38 కీ, సందడి పీక్ కీ వెళ్లింది! నేటి వీధి పారిశుద్ధ్య వేడుకను సమీక్షిస్తూ DRK డాక్టరుగారు గుర్తుచేసుకొన్న ఒక సంగతేమంటే:
ఈ చల్లపల్లికి మాత్రమే పరిమితమైన అదోరకం స్వచ్చ – సుందర - పిచ్చి కార్యకర్తలు మొత్తం 200 కు పైగా ఉండగా - ఆ వ్యసనం నసాళానికెక్కించుకొన్న హార్డ్ కోర్ (జగముదురు) వాలంటీర్లు పాతిక ముఫ్పై మందినైతే ఏ ఒక్క పూటా మాన్పించడం ఇక ఎవరి వల్లా కాదని!
ఈ వైద్యుని ఛలోక్తి కటిక నిజమని ఎవరు ఏ కొద్ది రోజులు వచ్చి పాల్గొన్నా- పరిశీలించినా ఇట్టే తెలిసిపోతుంది!
బైపాస్ - రైస్ మిల్లు వీధి కూడలిలో 4.20 నుండి 6.15 దాక ఎవరెవరి ఉచ్చిష్ట విసర్జనలనో నింపుకొన్న డ్రైనును 10 మంది బాగుచేశారన్నా –
రోడ్డు కిరు ప్రక్కలా నెలల తరబడీ పేరుకుపోయిన డంపుల్ని ఓపిగ్గా పెకలించి, ట్రాక్టర్ లోకి నింపుకొన్నారన్నా-
స్వయంగా తామే నాటి పెంచిన చెట్ల కొమ్మల్నీ, పిచ్చిచెట్లనూ నరికేసి, షెడ్డర్ నోటికందించారన్నా –
వడ్లమర బజార్ లోని, పడమర డ్రైన్లోని చెత్తా చెదారాల్ని డజను మంది తొలగించారన్నా -
మొత్తమ్మీద 150 గజాల ఉభయ వీధులు తెల్లారే సరికి శుభ్రంగా, అందంగా కనిపిస్తున్నాయన్నా-
హాస్టల్ ముందు భాగాన్ని ఏ 4 వ – 5 వ సారో శుభ్ర సుందరీకరించారన్నా –
అదేదో తమ ఇల్లే అన్నట్లుగా చీపుళ్లతో ఊడ్చి ఆనందిస్తున్నారనుకొన్నా –
వీళ్లంతా కాస్త తేడా మనుషులనడంలో సందేహమేముంది?
ఈ రకం మనుషులు గత 10 ఏళ్లలో 30-40 ఊళ్లలో కంపించారు గాని, ఆ ప్రయత్నాలు - 2-3 చోట్ల 1000 రోజుల దాక సాగినా, అవి క్రమంగా నిలిచిపోయినవి !
6.30 సమయంలో నాయుడు మోహనరావు గారు ప్రకటించిన గ్రామ స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలతోనూ,
"నందేటి శ్రీను ఆలపించిన "వృక్షో రక్షతి రక్షితః " పాటతోనూ, బుధవారం వేకువ కాలపు మన పునర్దర్శనం ఇదే బైపాస్ - భారత లక్ష్మి మిల్లుల కూడలిలోనే అనే నిర్ణయంతోనూ-
నేటి శ్రమ వేడుకకు స్వస్తి!
పిచ్చివాళ్ళ స్వర్గమనో
పిచ్చివాళ్ళ స్వర్గమనో పెచ్చరిల్లు మూర్ఖమనో
కీర్తి ప్రోగు చేసుకునే - గుర్తింపులకోసమనో
స్వచ్చోద్యమ చల్లపల్లి సాగుతున్నదనుకొంటే-
అంతకు మించిన పొరపాటుంటుందామనలో
- నల్లూరి రామారావు
23 .06.2024