పర్యావరణ ధ్వంసకమవుతూ-కేవలం ఒక్కసారి వాడేసే ప్లాస్టిక్కులు అవసరమా?
మంగళవారం (22-10-2024) శ్రమ విశేషాలు - @3269*
అవి విశేషాలనుకొంటే విశేషాలే! “కాదు – ఈ పెద్ద ఊరినీ, పాతిక వేలమంది జనాన్నీ శతశాతం మార్చగలమనుకోవడం భ్రమలు” అనుకునేవారికవి భ్రమలే.
“భూమి చదునుగా లేదు – గుండ్రంగా ఉన్నది” – అంటే నమ్మారా? ఆ శాస్త్రజ్ఞుడిని శిక్షించారు!
చెట్టు క్రింద కూర్చొన్న తన మీద యాపిల్ పండు పడితే – “అది భూమి మీదనే ఎందుకు పడ్డది – ఆకాశంలోకి వెళ్ళదెందుకు?” అనే న్యూటన్ ప్రశ్నను వెర్రి ఆలోచనగా కొట్టేశారు గదా!
“వస్తున్నాయొస్తున్నాయ్ - జగన్నాథ రథ చక్రాల్ రథ చక్రాల్ – రారండో ! రండో! రండి!..” అని 85 ఏళ్ల వాడు ఒక శ్రీశ్రీ గేయం రాస్తే – “ఇదేం పిచ్చి కవిత్వం” అనుకొన్నాం గదా!
పదకొండేళ్ల నాడు చల్లపల్లి గంగులవారి పాలెం వీధినీ, పదేళ్ల నాడు చల్లపల్లి మొత్తాన్నీ శుభ్రంచేయాలనీ, హరిత – సుందరీకరణ చేస్తామనీ ఒక గ్రూపు చేసే ప్రయత్నాన్నీ అంతే!
ఏ రోజుకారోజు బజార్లు శుభ్రపడుతుంటే – 32 వేల మొక్కలు కళ్ల ముందు పెరిగి పుష్పిస్తుంటే – ఇప్పటికీ ఈ శ్రమదానోద్యమం పట్ల నమ్మకం కుదరక – కుదిరినా వచ్చి సహకరించని వారుంటే ఉండవచ్చు మరి!
దశాబ్దం దాటినా – ఆ నమ్మకాలతో పని లేకుండా – చల్లపల్లిలో స్వచ్చ కార్యకర్తల నిష్కామ కర్మ జరుగుతూనే ఉన్నది.
ఈ వేకువ 4-16 కే కనీసం పదిమంది SBI దగ్గరకు చేరుకొని, వాళ్ళ బలం 25 గానూ, శానిటరీ ఇన్స్పెక్టర్ సూర్య ప్రసాదు తదితరులతో తుదకు 30 గానూ తేలింది.
ఇప్పుడు చూడండి - 6 వ నంబరు కాల్వ పడమటి ఉద్యానం ఎంత చూడ ముచ్చటగా ఉన్నదో – పింగళి మధుసూదన రావు గారి ఆస్పత్రి దాకా బందరు రహదారి ఎంతగా బాగుపడిందో - బ్యాంకు, జూనియర్ కాలేజీ, అటూ – ఇటూ కలిపి పాతిక దుకాణాల పరిసరాలన్నీ స్వచ్చ – శుభ్ర – సుందరంగా మారినవో!
నేటి తుది సమావేశంలో నినాదాలు పలికింది S.I. గారు, రేపటి వేకువ చర్యల కోసం మనం కలవదగింది – మునసబు వీధి ముంగిట్లో!
స్వచ్చోద్యమ మనగనేమి?
బ్రహ్మ ముహూర్తాన లేచి, బజార్లలో కసవులూడ్చి,
శ్మశానమున సంచరించి, మురుగుకాల్వ సిల్టు తోడి
ఊరంతటి స్వస్తతకై ఉరుకులు పరుగులు పెట్టే
స్వచ్చ కార్యకర్తలనెడి పిచ్చివాళ్ల స్వర్గం అది!
- నల్లూరి రామారావు
ఒక సీనియర్ స్వచ్చ కార్యకర్త
22.10.2024